అందరూ ఒక్కరు ఒక్కరే అందరు !

ఓం శ్రీ వల్లభ గణపతి కృప
ఓం శ్రీ అంగాళ పరమేస్వరి కృప
ఓం శ్రీ సద్గురువు కృప

మాయలూ మార్పులూ

మాటలకు, చేతలకు అతీతంగా, మెరుపుల వంటి శక్తివంతమైన దాడులు చేసేది – ఇది మాయ యొక్క భ్రమ.
-కరపాతిర సిద్ధుడు
అదుపులేని శక్తి, నియంత్రించడానికి ఎవరు సాహసించలేనిది, అప్పుడప్పుడు మింగివేసేది, నిరంతరం మానవాళిని వెంటాడేది – ఇదే మాయ యొక్క భ్రమ
-ఉడుక్కై సిద్ధుడు
భౌతిక శరీరాన్ని బలవంతముగా మోయిస్తుంది, మృత్యువును చూపించి వణికిస్తుంది, లైంగిక వాంఛల మాలిన్యములో పడవేసి మానవాళిని అతలాకుతలం చేస్తుంది – ఇదే మాయ యొక్క భ్రమ.
- కుప్పై సిద్దుడు
స్త్రీ పురుషులు ఆకర్షణకు లోనై, పరస్పరము భౌతిక సహవాసము కోరుకొనేట్లుచేసి, ఫలితముగా కష్టాల కడలిలో ముంచి, మానవాళితో దాగుడుమూతలు ఆడుకొని చివరకు కర్మ ఋణం మిగుల్చుతుంది – ఇదే మాయ యొక్క భ్రమ.
- తొళుపేడు సిద్దుడు
అబద్ధం మరియు అపవాదును బంగారంగా మారుస్తుంది, సత్యాన్ని అర్థరహితం చేస్తుంది మరియు ఒక మనిషిని పాపానికి బంధిస్తుంది – ఇది మాయ యొక్క భ్రమ.
-సిలక్కాగిత సిద్దుడు
ఈ విధంగా చాలా గొప్ప సిద్ధ పురుషలు "సగౌరవము" గా "మాయ" అనబడే భ్రమ యొక్క అనేక కోణాలను వివరిస్తారు. ప్రతి వ్యక్తి, అతని లేక ఆమె ఆధ్యాత్మిక పురోగతి ప్రకారం, అనంతమైన ఆకారాలు, పరిమాణాలు మరియు శక్తుల ద్వారా కనికరం లేకుండా దాడి చేసే మాయ యొక్క ప్రభావాన్ని ఎదుర్కోవాలి, అంతర్గతంగా, బాహ్యంగా మరియు శాశ్వతంగా పోరాడాలి. దాని క్రూరమైన బారి నుండి ఎవరూ నిజంగా విముక్తి పొందరు. మాయ యొక్క కొన్ని రకాలు – కనిపించే మాయ, కనిపించని మాయ, గ్రహించగలిగే మాయ, గ్రహించలేని మాయ, అశక్తుని చేసే మాయ, ప్రాణాంతకమైన మాయ, వాస్తవిక మాయ మొదలైనవి. ప్రతీ వస్తువు, జీవమైనా, నిర్జీవమైనా, ఎదో ఒక విధముగా, మాయ యొక్క శక్తిచేత నియంత్రించబడడం, లేక ముందుకు నడిపించబడడం జరుగుతుంది. అందువల్ల మాయ యొక్క ప్రేరణ, ఆకారం, పరిమాణం, శక్తి, సమయం, ప్రదేశం మొదలైన వాటికి సంబంధించి దాడిని ఎవరూ ఊహించ లేరు.
శ్రీ అరుణగిరినాదరు సరళమైన మాటలలో పాడారు ..
“ఊహించలేనిది మాయ
మానవాళిని ఎల్లప్పుడూ మంచి లేదా చెడుతో బంధించేది ”

మాయయొక్క శక్తి

మనిషి మాయ యొక్క ఆనవాలు పట్టడానికి కానీ, వర్గీకరించుటకు కానీ, మాయ తత్వాన్ని నిరూపించుటకు కానీ, ఏ ప్రయత్నము చేసినా, అది పుట్టుకతో అంధుడైనవాడు నల్ల పిల్లిని చీకటి గుహలో అర్ధరాత్రి వేళ వెదకినట్లుంటుంది. మాయ యొక్క అద్వితీయ లక్షణమేమనగా, మనిషిని స్వాధీన పరచుకొన్నా గుర్తించ లేకపోవడము, మాయ ఆవరించిఉన్నపుడు దాని చర్య సందేహింపరు, కనీసము విపత్తు ముగిసి, మాయ ప్రాబల్యము సడలిన తరువాతైనా, దాని హస్తమును ఇసుమంత కూడా అనుమానింపరు, మాయ సలిపే రాక్షసహేలను అసలే తెలుసుకోలేరు.
అనంతమైన శక్తితో ఎవరిని విడవకుండా విశ్వమంతా వ్యాపించి ఎల్ల వేళల క్రియాశీల యై మాయ ఉన్నది. మాయను పరిష్కరించి, వేళ్ళతో పెకలించడానికి దానిని పుట్టుకనుండి అర్ధము చేసుకోవాలి. ఒక వ్యక్తి కృషితో తన శక్తిని, బుద్ధిని తర్కములో పెంపొందించుకొని అనేక మతపరమైన పుస్తకాలూ చదవ వచ్చు, శాస్త్రీయ విజ్ఞానము పెంపొందించుకొని, మతపరమైన విషయముల గూర్చి అనేక వేల ఉపన్యాసములు చేయవచ్చు. కేవలము పుస్తక అధ్యయనముతో దివ్యానుభవమును పొందలేరు. వ్యాకరణము, సాహిత్యం, నాటకము, సంగీతము వంటి వానిలో ఉద్దండులు, వక్తలు అయి ఎన్నో డాక్టరేట్లు సంపాదించవచ్చు. కానీ ఎల్లపుడు భగవంతుని పైనే మనుసు నిలిపి, వాక్కు, ఆలోచనలు, క్రియలు భగవంతనువిగా చేయడం మనుషుల ఊహకుకూడా అతీతమై ఉంది.
ఈ విషయాన్ని వివరించడానికి ఒక చిన్న కథ ఉపదేశించబడినది. నలుగురు వ్యక్తులు ఒకే సమయంలో ఒక ద్రాక్షతోటలోకి ప్రవేశించారు. ద్రాక్ష పండ్లు బాగా పండాయి. నలుగురిలో ఒకడు తోటలో ఉన్న మట్టి మీద ప్రయోగాలు ప్రారంభించాడు. రెండోవాడు ఆ పండ్ల ఆకారం, పరిమాణము, రంగు మీద తన పరిశోధన ప్రారంభించాడు. మూడోవాడు పండ్ల కోత తరువాతి వాణిజ్య అంశాలతో పనిలో పడినాడు. చివరి వ్యక్తి అటువంటి పనికిరాని పరిశోధనలు మరియు ప్రయోగాలు ఏమి పట్టించుకోకుండా నేరుగా బాణం లాగా పండ్లు కోసి, వాటిని రుచి చూడటం ప్రారంభించాడు. ఆ నలుగురిలోనూ పండ్లు తిన్నవాడు మాత్రమే వాటి రుచిని ధృవీకరించి చెప్పగల సమర్థుడు. ఇదేవిధంగా, పదాల యొక్క అందం మరియు అర్థాల గురించి లోతుగా పరిశోధించవచ్చు, అంతటితో దైవత్వాన్ని ఎన్నడూ గ్రహించలేరు. అదేవిధ౦గా, మాయ గురి౦చి చర్చి౦చి, లోతుగా శోధించి, పరిశోధనచేసే వ్యక్తులు దాన్ని అర్థ౦ చేసుకోవడ౦లో కొద్ది ప్రయోజనం మాత్రమే పొ౦దవచ్చు, కానీ మాయను ఎన్నటికీ గ్రహి౦చలేరు. మాయను గురించి ఇతరులకు అవగాహన కలిగించాలంటే, ముందుగా తాను పూర్తిగా మాయను తెలిసికొని ఉండాలి.

సద్గురు దివ్య పాత్ర

మాయను పూర్తిగా తెలిసికొని, అవగాహన చేసుకొని, గుర్తించి అణచివేయగల వారు కేవలము దైవీక గురువు లేక సద్గురువు. దివ్యత్వమును చేరడానికి అవసరమైన జ్ఞానము, అవకాశము కల్పించేది కేవలము గురువు. ప్రయత్నపూర్వకముగానైనా, అసంకల్పితముగానైనా చేసే చర్యలకు మూల కారణమైన మాయను గ్రహించే సామర్ధ్యము సద్గురువునకే ఉంది.
మాయను అర్ధము చేసుకోవడానికి మొదటి దశ సుస్పష్టమైన స్పృహను కలిగిఉండడం. బురద నీటిలో ఎవరూ ప్రతిబింబమును చూడలేరు. అదే విధముగా గందరగోళములో చిక్కుపడిన మనస్సు విలువైన విషయాలను స్వీకరించి నిలుపుకోలేదు. స్పష్టమైన, వ్యాకులత లేని చైతన్యాన్ని పొందడానికి ఒక వ్యక్తి పూర్తిగా అతని జీవితాన్ని దైవ గురువునకు సమర్పించుకొని, గురుసేవలో అంకితం కావాలి. మనస్సు అన్ని ప్రతిబంధకాలను వదిలించుకున్న తరువాత, అది మాయను అర్ధము చేసుకోవడం ప్రారంభించవచ్చు. మాయ యొక్క అవగాహన మాయను జయించే మార్గాలను రూపొందించడానికి దారి ఏర్పరుస్తుంది. అలాగే, మాయను జయించడానికి దారి తీస్తుంది.
తిరుమూలరు అనే సాధువు తిరుమందిరంలో మనస్సును కలవరపాటు సంకెళ్ళ నుండి ఎలా విడుదల చేసుకోవాలో సులభంగా నాలుగు పంక్తులలో వివరిస్తారు.
தெளிவு குருவின் திருமேனி காண்டல்
தெளிவு குருவின் திருவார்த்தை கேட்டல்
தெளிவு குருவின் திருநாமம் செப்பல்
தெளிவு குருஉரு சிந்தித்தல் தானே

తెలుగులో,
సద్గురుని పవిత్ర దేహము దర్శించినంతనే స్పష్టత కలుగును
సద్గురుని దివ్య వచనశ్రవణముతో స్పష్టత కలుగును
సద్గురుని పవిత్ర నామ జపము స్పష్టత ననుగ్రహించును
సద్గురుని పవిత్ర రూపమును ఏకాగ్రతతో ధ్యానించితే స్పష్టత కలుగును

సుశీలత, సదాచారము కలిగిన జ్ఞాని యైన వ్యక్తి, తన యొక్క సంపదను, శారీరక సౌఖ్యములు, వినోదాలు పూర్తిగా త్యజించి, నిరంతరము హృదయపూర్వకంగా సద్గురువుకు సేవలందించినచొ సద్గురువు యొక్క హృదయపూర్వక, దివ్యమైన ఆశీర్వాదములు బ్రహ్మవిద్య లేకుంటే దివ్యజ్ఞాన రూపంలో పొందగలుగుతాడు.
మేధోసంబంధిత పరిశ్రమము మరియు కసరత్తులన్నియు అంటరాని అసంగతత్వములుగా పరిగణించాలి. జ్ఞానము, తెలివి, సామర్ధ్యత ఉపయోగించి, మనిషి ఆధ్యాత్మికతలో అతి చిన్న భాగమును మాత్రమే తెలుసుకోగలడు. మనిషి ప్రతి జీవియొక్క జీవితంలో జరిగేది, తాను చూచినది, అంతిమసత్యము అన్న నమ్మిక దిశగా ఉన్ముఖుడై ఉంటాడు. కానీ, ఒక్కసారి మహర్షుల యొక్క రహస్య విజ్ఞానము నందు ప్రవేశపెట్టబడితే, సందేహము లేదు, మనుష్యనాటకములన్ని వాని రంగస్థలముతో సహా మహా భ్రాంతియని గుర్తించగలరు. మాయను అవగాహన చేసుకొనగలరు, వారి మూడవ కన్ను లేక జ్ఞాన చక్షువు తెరవబడుతుంది, ఆధ్యాత్మిక ప్రపంచపు తలుపులు వారికి తెరుచుకుంటాయి. అంతటి ఊహించలేని, పరిమితులులేని శక్తి మరియు అనుగ్రహము సద్గురువు నుండి ప్రసరిస్తాయి. ఈ విషయము తేటపఱచడానికి, దాదాపు ఇరవై వేల సంవత్సరాల క్రితము భూమి ముఖం నుండి ఎటువంటి జాడ లేకుండా అదృశ్యమైపోయిన, శక్తివంతమైన అట్లాంటియన్ నాగరికతలో జరిగిన ఒక సంక్షిప్త వృత్తాంతమును ఇక్కడ చెబుతున్నాము.
అట్లాంటియన్ నాగరికతలో ఒకానొక దశలో భౌతిక శాస్త్రం మరియు చేతబడి వంటి విద్యలలో ప్రావీణ్యతను సంతరించుకున్నారు. అట్టి విజ్ఞానము పరాకాష్టనందుకొంది. చనిపోయినవారిని సైతం పునరుర్ధానము చేయగలిగేవారు. ప్రకృతి నియమాలలో జోక్యం చేయగలిగేవారు. అప్పుడే పుట్టిన శిశువులను దేవాలయ ప్రధాన పూజారి దగ్గరకు తీసుకెళ్లేవారు. దేవాలయములలో ప్రధాన పూజారి, వారి శక్తులను వినియోగించి, శిశువు గత జన్మలను ఎరిగి, ఈ భూమిపై ప్రయాణపు లక్ష్యమును కనిపెట్టేవారు. ఆత్మ యొక్క గతములోని యోగ్యత , లోపములను క్షుణ్ణముగా విశ్లేషించి, శిశువు ప్రస్తుత జన్మమును సఫలీకృతము చేయడానికి తలితండ్రులకు మార్గనిర్దేశము చేసేవారు. శిశువుయొక్క భవిష్యత్తును అర్చకులు అసాధారణమైన యదార్థతతో అంచనా వేయడానికి ఎక్కువ ఆధ్యాత్మిక పురోగతిని సాధించి మాయను అన్ని కోణాలలో జయంచి ఉండాలి. భ్రమలను జయించి, మాయను యెఱిఁగిన గురువు మాత్రమే ఒక వ్యక్తి యొక్క మాయలో (జీవితములో) తేడాను తీసుకురాగలరు.
"ఈ కలియుగంలో అందరికీ సద్గురువును పొందే వరము కలదా ?" అని భోగారు ఋషి వారి సద్గురువైన అగస్త్య భగవానులను విచారించారు. మానవాళి తరఫున ఋషి అడిగిన అద్భుతమైన ప్రశ్నకు సమాధానముగా అగస్త్యులవారు ఇట్లు బదులిచ్చారు. గురువు చెంత వినయపూర్వకమైన సాష్టాంగ నమస్కారాల వలన మాత్రమే కాకుండా, ఆది నుండి శరీరము కృశించి నశించే వరకు, గురువు యొక్క మాటలను అనన్య విశ్వాసముతో స్వీకరించినప్పుడే నిజమైన భక్తిని అలవరచుకోవడానికి సాధ్యము. కానిచో, ఒక వ్యక్తి ఆతని మేధోపరమైన సామర్ధ్యాలను ఉపయోగించి చేసే పరిశోధన, అవగాహన, అనువర్తనం అన్నీ వృధా యత్నాలుగా మారుతాయి. గురువు చెంత స్వయముగా శిక్షణ పొందనిదే ఎటువంటి ప్రతిభ, ప్రజ్ఞ రాణించవు. గురువు లేని మనిషి జీవితము వృధా, కొన్నిసారులు చాలా నష్టపోగలడు.
ఇంతకుముందే చెప్పినట్లుగా, ఒక స్పష్టమైన చైతన్యమును సాధించడానికి, ఒకరి మనస్సు నుండి అన్ని చీకాకులు తొలగించుకోవాలి. దానికి ముందుగా, అన్ని గందరగోళాలకు మూల కారణం కోరిక అని స్పష్టంగా అర్థం చేసుకోవాలి.
కల్లోలపడిన మనసును స్వాధీనపరచుకొనుటెలా?
కోరికలు హద్దులు మీరినప్పుడు, అవి కార్యరూపము దాల్చనప్పుడు, కఠిన నైరాశ్యము అలుముకొంటుంది. ఈ రకమైన నిస్పృహ ప్రతివారి జీవితములో, ఎదో ఒక సమయములో లేక దశలో కలగవచ్చు. నిరాశ పరాకాష్ఠకు చేరినప్పుడు మనిషిలో ద్వేషము ఏర్పడి, అది విపరీతమైన క్రోధమునకు కారణము కాగలదు. ఎప్పుడైతే మనిషి కోపానికి వశుడౌతాడో అప్పుడు అతనిలోని తెలివి నశిస్తుంది. అంతే కాదు ఆతడి శక్తి సామర్ధ్యములు, బుద్ధి కుశలత, ప్రజ్ఞ అన్ని ఆతనిని విడిచి ఎదో దుష్ట అపరాధమును చేయడానికి ప్రేరేపింపబడుతాడు. మనిషి తన్ను తాను రక్షించుకోవాలంటే ఎల్లప్పుడు జాగృతుడై, క్రోధగుణమును దూరముగా ఉంచాలి.
శ్రీ తిరువళ్ళువరు సరళమైన శ్లోకంలో ఇలా అంటారు :
தன்னைத்தான் காக்கின் சினம்காக்க காவாக்கால்
தன்னையே கொல்லும் சினம்
తెలుగులో
మనిషి తనను తాను రక్షించుకోవాలంటే కోపమును తొలగించుకోవాలి
లేకుంటే క్కోపము ఆతనిని నిశ్చయంగా చంపుతుంది

ఎటువంటి సంఘటన, సమస్య, ఆపద, సంకట పరిస్థితి, ఎదురైనా, అత్యంత సహనశక్తితో నుండి, ఓర్పు కలిగి ఉంటే, మాయ వలన జనించే భ్రాంతులను, వంచనలను జయించే విధంగా ఎదుర్కోవచ్చు.
శాంతము, సహనశక్తి, స్థిరత్వము అనేవి మాత్రమే జీవితంలో ఏర్పడే ఇడుములను, విపత్తులను, ఆటంకాలను ఎదుర్కోవడానికి గొప్ప అస్త్రములుగా ఉపయోగపడేవి. ఈ మూడు గుణములు మాత్రమే మనిషికి అన్ని పరిస్థితులలో చక్కటి దృష్టికోణమును పెంపొందునట్లు చేసి, అనాలోచితముగా అంధుడై ప్రవర్తించకుండా, లేక మొండితనముతో తొందరపాటు అడుగులు వేయకుండా కాపాడేవి.
ఎలాంటి కష్టకాలమందైనా తెలివి, సహనము కలిగివుండి, పరిస్థితిని బాగా విశ్లేషించి నిర్ణయమునకు వస్తే మాయాజనిత పరిణామములను, భ్రాంతులను ఛేదించి విజయము నొందుట తధ్యము. జీవితంలో ఆపదలను ఎదిరించే సమయాలలో శాంతము, నెమ్మదిగల దృష్టి కలిగిఉండడమే, సద్గురుని హృదయపూర్వకమైన ఆశీర్వాదము వలన దక్కు ఫలము.
ఈ ఒక్క వరమే కాక, సద్గురువు ఒక వ్యక్తిని తేఱిచూచినంతనే అందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఐహికసుఖములు, శక్తిసామర్ధ్యములు, వంటి మహా భ్రాంతులు ఆతని తక్షణమే వీడగలవు. తద్వారా సద్గురుని చూపు ఒకరిని మోహరహితుని చేసే శక్తిని కలిగిఉన్నది.
మనిషి ఎంత కాలమైతే మాయకు లోబడియుంటాడో, అంత వరకు తాను ఈ ప్రపంచములో అన్నింటి కంటే వేరు అన్న భావనతో మనుగడ సాగిస్తూ ఉంటాడు. సూక్ష్మము, జీవాత్మ, దివ్యమైన వెలుగు. ఇలా అనేక విదాలుగా వర్ణింపబడే మనిషి ఏ మాత్రము అఖిల సృష్టి నుండి వేరు కాదు. విశ్వజగత్తు, దైవీక అగ్ని, పరమాత్మ, ఇవన్నీ భగవంతుని వివిధ నామములు. మనుష్యుడు, సర్వేశ్వరుడు ఇద్దరూ ఒక్కటే. మాయ యొక్క ప్రభావము, పర్యవసానములకు ఏ మాత్రము ప్రభావితము కాక (లోను కాక) తనను తాను తెలిసికొన్నది పరమాత్మ. కానీ, పాపము జీవాత్మ మాయలో బంధింపబడి భిన్నత్వములో ఏకత్వమును అర్ధము చేసుకోవడములో పూర్తిగా విఫలమై అన్ని విధములైన ఆపదలను ఎదుర్కొంటోంది.
ఈ విషయమునే సరళమైన రీతిలో ఇలా విశదీకరించవచ్చు. కూజా, వంటపాత్ర, పొయ్యి, పూలతొట్టి, ఇళ్ళలోకప్పు పెంకులు, అన్నీ మట్టితో తయారు చేయబడినవే. ఈ వస్తువుల భౌతికత్వము నశింపగానే, మిగిలేది మూల పదార్థమైన మట్టి మాత్రమే. అదే విధముగా, ప్రాథమికమైనదానికి , మరియు సర్వమునకు మూల పదార్ధము ప్రకృతి. చేతనత్వము కలిగినవి, అచేతనమైనవి, కంటికి కనబడేవి, అగోచరమైనవి, తెలిసికొనగలిగినవి, తెలిసికొనశక్యము కానివి, అన్నీ కూడా ప్రకృతి లేక పరమాత్మ శక్తి నుండి జనించినవే. మనుష్యసంబంధమైన నాటకములన్నీ కంటికి కానరాని కాలము అనే రంగస్థలమును ఆధారముగా చేసికొని, నడిచి, చివరకు ప్రదర్శన ముగిసిన తరువాత, అందులోని నటులు, దర్శకుడు, వాద్యబృందము, వేదికతో సహా ఒక్కటై, పరమాత్మలో లేక అనంత విశ్వములో విలీనమైపోతాయి. కనుక, నటులు కాని, రంగస్థలము కాని, స్థిరము కాదు. కేవలము, అనంతము ఐన సర్వాంతర్యామి మాత్రమే శాశ్వతము.
పరివర్తన చెందేవి శాశ్వతము కాదు. శాశ్వతము కానిదంతా మాయగా పిలువబడుతుంది. భగవాన్ రమణమహర్షి వాక్పటిమతో “మార్పు తప్ప వేరేదీ శాశ్వతము కాదు,” అన్నారు. ఇందువలన విశ్వమంతటా మార్పు మాత్రమే నిత్యమై యుండే విషయము. ఒక ఉదాహరణ. అద్దములోని ప్రతిమను మాయతో పోల్చవచ్చు. అట్లుండగా, అద్దమునకు వెలుపల ఉన్నది వాస్తవిక వస్తువు. అద్దమును తొలగిస్తే ప్రతిబింబము నశించిపోవును. కానీ, అద్దములో అగుపడిన వస్తువు మాత్రము యదార్ధముగా మిగిలి ఉన్నది. మనము అందమైన రంగుటద్దాలను ధరించి వస్తువులను, మనుష్యులను చూడడం వలన వస్తువుల యొక్క, మనుష్యుల యొక్క నైజము తెలుసుకోవడంలేదు. అట్టి అద్దాలను తీసివేసివస్తునప్పుడో, పగులగొట్టితేనో, వాస్తవికత బోధపడుతుంది.
అలాగే, ప్రధానమైన అంశముగా వెలుగొందే భగవంతుడు దేశ, కాల, పరిణామములకు అతీతమై యున్న యదార్ధము. సృష్టిలో దేశ, కాల పరిణామములచే ప్రభావితమై ఉన్న తక్కిన విషయములు అన్నీ మాయ. మాయను గురించి కొంత అవగాహన ఏర్పడినందున, మనము ఇప్పుడు మాయను అర్ధం చేసుకోవడానికి పద్ధతులను గురించి పరిశీలించుదాము. మనిషిని పూజించి గౌరవించితే మహాత్ముడౌతాడు. మనిషి శాపగ్రస్తుడైనా, ఈసడించుకోబడినా (అలక్ష్యము చేయబడినా) జంతువుగా మారుతాడు. మహాత్ముని వలె ఆదరణ పొందితే అంతులేని ఆనందమును అనుభవిస్తాడు. జంతువులా పరిగణించబడితే మిక్కిలి దుఃఖమునకు గురియవుతాడు.
మంచిచెడులు, ఉఛ్చనీచలు ఇవి జంట గుణములు. ఇట్టి జంట గుణములకు లోబడి, వానిచే ప్రేరేపింపబడినంత వరకు, వానిని భేదముతో చూసినంతవరకు, వ్యక్తి దృష్టి మాయచే కప్పబడి, ఆతడు తనను బంధనము లోకి నెట్టివేసే మాయను అర్థము చేసికోవడంలో, పూర్తి అసమర్థుడుగా ఉంటాడు. ప్రశంసించినప్పుడు సంతోషించటం, తృణీకరించబడినప్పుడు బాధపడటం కాకుండా ఎల్లప్పుడూ తటస్థ స్థితిలో ఉండడంతో, మనిషి తన మొదటి మెట్టు అర్హత సాధిస్తాడు. అత్యంత స్వీయ-నియంత్రిత వ్యక్తి మాత్రమే మాయ అని పిలువబడే అత్యంత మార్పు నొందుతున్న కోణాన్ని అర్థం చేసుకోగలడు.
రెండు వస్తువులు, రెండూ కదలికలో ఉన్నప్పుడు ఒకదానినొకటి తెలుసుకోలేవు. విశ్వసంబంధమైన నిబంధన ఏమిటంటే, రెంటిలో ఒక వస్తువు స్తంభించి ఉన్నప్పుడే వేరొక దానిని తెలుసుకోగలదు. మన ప్రాచీన ఋషులు వేల సంవత్సరముల క్రితమే, ఐన్ స్టైన్ లాగ సంక్లిష్టమైన గణితము వాడకుండానే మాయ సూత్రమును రెండు మాటలలో వివరించారు, ‘భేదములు, మాయలు’.
పట్టినత్తారు సాధువు మార్పు నొందని ఈశ్వరుని తత్వమును ప్రకటిస్తూ ఇలా పాడినారు:
ஊரும் சதமல்ல உற்றாரும் சதமல்ல
உற்று பெற்ற பேரும் சதமல்ல
பெண்டிர் சதமல்ல பிள்ளைகளும் சதமல்ல
இவ்வுலகில் யாரும் சதமல்ல
நின்தாள் சதம் கக்சி ஏகம்பனே
తెలుగులో,
నా జన్మస్థలం శాశ్వతము కాదు
మన బంధువులు శాశ్వతము కాదు
అత్యంత శ్రమ నొంది మనం ఆర్జించిన ప్రఖ్యాతి శాశ్వతము కాదు
స్త్రీలు శాశ్వతము కాదు మన సంతానమూ శాశ్వతము కాదు
ఎవ్వరూ ఈ ప్రపంచములో శాశ్వతము కాదు
కంచి ఏకాంబరేశ్వరా నీదు పవిత్ర పాదముమాత్రమే శాశ్వతమైనది.

వేదములు కూడా ఈ సత్యమునే ఘోషిస్తున్నవి. ‘బ్రహ్మైవ సత్యం జగత్ మిధ్య’. మాయ ఒక వ్యక్తి సహించగలిగే పరిమితిని మీరితే ఆపత్సమయాలలో, దుఃఖావస్థలలో, మోసపోయిన వేళలలోను, ఉన్మాదిలా ప్రవర్తిస్తాడు. అదే విధంగా, పూర్తిగా స్వార్ధపరుడైన మనిషికూడా స్వప్రయోజనము సాధించుకోవడానికి ఉన్మాదిలా ప్రవర్తిస్తాడు.
మాయలో చిక్కిన మనిషి తన తెలివిని, శక్తిసామర్ధ్యములను, వివేకము, చదువులు అన్నీ కోల్పోతున్నాడు. తాను మాయచేత ప్రభావితుడై వివేకమును, తెలివిని కోల్పోయి, శక్తి హీనుడైన సంగతి తెలిసికొన్న పిదవ మాత్రమే, భ్రమల నుండి విముక్తుడై శాశ్వత ఆనందమునకు మార్గమునేర్పరచుకొన్నవాడౌతాడు.
అన్ని క్లేశములకు మూల కారణం మాయ. మాయకు మూల కారణము అవధి తెలియని అజ్ఞానము. మహోన్నతమైన శాశ్వతానందమునకు మూలకారణము ఆత్మ జ్ఞానము కలిగిఉండడము (ఆత్మ సాక్షాత్కారము వలని జ్ఞానము)
ప్రజ్ఞ పరిపక్వత చెందితే స్వార్థపరత్వము నశిస్తుంది. స్వార్థపరత నశింపజేస్తే , దయ, పరహితార్ధత జనిస్తాయి. ఈ విధముగానే శాశ్వతమైన ఆనందము అనుభవించడానికి బంగారు బాట ఏర్పడుతుంది.

మృత్యువే నిజమైన గురువు

ఈ సందర్భములో భోగారు మహర్షి అత్యంత వినమ్రతతో అగస్త్య మహర్షిని ప్రశ్నించారు. “గురువర్యా, మానవాళి ఏ విధమైన యోచన చేస్తే స్థిరమైన మనస్సును సాధించగలరు. ఒకమనిషి తన మనస్సును పూర్తిగా స్వాధీనములో ఉంచుకొని బాహ్య విషయములకు చలించక అమితమైన నైపుణ్యతను అలవరచుకోవడానికి ఏ విధమైన ధ్యానము అవలంబించుకోవాలి ?”
అప్పుడు అగస్త్య మహర్షి ఇలా సమాధానమిచ్చారు, “ప్రతి మనిషి, అనుక్షణం మృత్యువు గురించి ఆలోచించాలి, భోగా”
ఆరంభము ఉన్న ప్రతి దానికి ముగింపు కూడా ఉండాలి. ఇది విశ్వమంతటిని నడిపించు శాశనం. జనన మరణములు జగన్నాటకంలోని భాగములు. అంతా భగవంతుని లీల.
భౌతికవాద సిద్ధాంతము ప్రకారము మరణము దుఃఖకరమైన సంఘటన. ఇది నిజమా? కాదు, కాదు, కాదు. మనిషి బ్రతికున్నంత కాలము ప్రాపంచిక జీవితములో ఎన్నో శ్రమలకు ఓర్చి, సుఖదుఃఖముల మధ్య నలిగిన ఆత్మకు, భౌతిక శరరీరమనే చెఱసాల నుండి విముక్తిని ప్రసాదించడానికి భగవంతుడు మరణము నేర్పరచెను. పంచభూతములను ఆధారముగా చేసికొని ఏర్పడిన తోలుతిత్తిలో (శరీరములో) బంధించ బడిన ఆత్మ, అనేక కష్టములు భరించిన పిదప, వృద్ధాప్యము సమీపించియో, వ్యాధి బారిన పడడము వల్లనో, నిదానముగా శక్తిని, సజీవత్వమును కోల్పోయి, మృత్యురూపములో ఒక్కసారిగా జీవితమనే సుదీర్ఘఖైదునుండి విడుదల నొంది స్వేచ్ఛను అనుభవిస్తున్నది - అనంత కరుణామయుడైన సర్వేశ్వరుడు వేదనలననుభవించిన ఆత్మలకు ప్రసాదించిన వరము మరణము. అనేక సంవత్సరములు ఇనుప పంజరంలో ఖైదు ననుభవించి హఠాత్తుగా స్వేచ్ఛ నొంది, అత్యంత సంతోషముతో పొంగిపోయే పక్షితో సరి పోల్చవచ్చు- అని సిద్ధపురుషులు చెబుతారు.
వేఱొక మాటలో చెప్పాలంటే మనిషి మరణము ద్వారానే మాయకు మూలమైన వాటిని గ్రహించగలడు. ప్రాచీన ఈజిప్టు దేశములో చక్రవర్తుల సమాధుల గోడలపై మరణానంతరము జీవుని యొక్క పరిస్థితిని బొమ్మలతో చిత్రించేవారు. ఒక చిన్నపక్షి మృతదేహమునుండి బయటకు వచ్చి, పైకి ఎగురుతున్నట్లు బొమ్మలను చిత్రించేవారు. తద్వారా, ఆత్మ, వారి భాషలో ‘కా’, తోలుతిత్తి (మాంసపు) పంజరమునుండి విమోచన పొంది అంతరిక్షంలోకి పూర్తి స్వేచ్ఛతో ఎగిరినట్లు సూచించేవారు. ఆత్మ సాక్షాత్కారమునొందిన సద్గురువు మాత్రమే శరీరమును వీడిన ఆత్మ పొందే అపరిమిత ఆనందమును సమస్తము ఎఱిగి మెచ్చుకోగలరు. శరీరమును వీడి అప్పుడే బయలుదేరిన ఆత్మతో దూరసంభాషణ ద్వారా సంబంధమునేర్పరచుకొనే సమర్ధత కేవలము సద్గురువునకే కలదు. అప్పుడే శరీరమును విడిచిన ఆత్మకు , అనుకూలమైన, సమున్నతమైన స్థానములో ఉన్నటువంటి సద్గురువు పరలోక ప్రయాణానికి కావలసిన మార్గనిర్దేశము చేయడానికి పూనుకొంటారు. దూరశ్రవణ (దూరసంవాద) సంబంధముతో ఆత్మ యొక్క జీవనగమనమును గురించి తాజాయైన సంపూర్ణ సమాచారమును అప్పటికప్పుడు తెలిసికొంటారు. ఇలా, భౌతిక కాయమనే చెఱసాలనుండి విడుదలైన ఆత్మ అనుభవించే అనంత సంతోషమునకు సద్గురువు మాత్రమే సాక్షిగా నిలచియున్నారు.
పూర్తిగా మాయలో నిమగ్నమైయుండి , ఆత్మను గ్రహించలేక, జీవులు జీవిపుట్టుటను ఘనమైన ఉత్సవంగా జరుపుతారు. అందులోను మగసంతానమైతే మరింత గొప్పగా పరిగణిస్తారు.
అజ్ఞానపు వెల్లువతో కప్పబడిన మానవాళిఫై మాయ విసిరే అతి పెద్ద దెబ్బ- పుట్టుక వేడుకతోను, మరణము వేదనతోను అన్వయించుకొని, అతిగా చలించే మనస్తత్వమును కలిగి మనుగడ సాగించడమే. జననమరణములను యధాదర్శనముతో అర్ధము చేసికొని వానికి తగినంత ప్రాధాన్యతను ఇవ్వడమే భేదము. జననము, మరణము, సంతోషము, దుఃఖము, మంచి, చెడు లను పోలిన మోసపుచ్చు ద్వంద్వాలకు, కించిత్ చలించక, వ్యాకులతకు ఏనాడూ లోబడక ఉండగలిగే జీవుడు (జీవాత్మ) కేవలము సద్గురువు లేక జ్ఞాని.
ఎవ్వరైనా పైకి మృతుభయము లేదని మరణాన్ని తృణప్రాయముగా తోసిపుచ్చే మాటలు చెప్పవచ్చు. నల్లని ముసుగులో అరుదెంచేది మృత్యుఘంట అని తెలియగానే అంతర్గతములో నుండి భీతిచేత కంపించని మనిషి ఈ ప్రపంచము లోనే లేడు. ఎన్నడూ ఆత్మసాక్షాత్కారం పొందటానికి సరియైన ప్రయత్నము చేయకపోవడమే ఇటువంటి అర్థరహితమైన భయమునకు కారణమైయున్నది.
భౌతిక మరణము చాటున దాగిఉన్న రహస్యాలను గురించి సమగ్రంగా పరిశీలించే ప్రయత్నము అసలైన ఆత్మ సాక్షాత్కారము. మహా సిద్ధపురుషుడైన కుప్పై సిద్ధర్ ఈ విధముగా చెప్పారు.
రమణ మరణానుభవము పొందారు. కావున తన స్థిరమైన నమ్మికను శివునివైపు మరల్చారు. తీవ్రమైన వెఱపు, దుష్టత్వము, క్రూరత్వము అలుముకున్న ముసుగులో ఉండే మృత్యువు యొక్క తెర ఒక్కసారిగా తొలగగానే, భగవాన్ రమణ మహర్షికి ఆత్మసాక్షాత్కారం ఉదయించింది. ఒక్కటే మతము, ఒక్కడే భగవంతుడు. ఈ నమ్మికను కలిగి ఉంటె, మరణమంటే భయము లేదు. దీనినే ‘ఏకీశ్వర సిద్ధాంతము’ అంటారు. నిరంతరము మరణము అనే అంశమునే ఆలోచించే మనిషి అన్యమనస్కత వీడి, అంతర్ముఖుడై, ఆత్మసాక్షాత్కారము పొందడానికి బాటను ఏర్పరచుకొని, చివరకు జననమరణ ద్వయమునకతీతమైన స్థానమునందగలడు.

భగవద్గీత దారి చూపుతుంది

ఇప్పటి ప్రధానాంశమైన ‘భేదములు, మాయలు’ చూద్దాము. ప్రాచీనగౌరవము గల వైష్ణవ సంప్రదాయములో అప్పుడే నశ్వరమైన భౌతిక కాయమును వీడిన ఆత్మకు మార్గము చూపే పద్ధతిని ఇప్పుడు విశదీకరించుదాము. శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునునికి ఈ రహస్య జ్ఞానమును అందించారు.
వైద్యపరీక్షలో మృత్యు వశుడై ఉన్నాడని నిర్ధారించిన ఒక వ్యక్తిని నమూనాగా తీసుకొని, వైష్ణవ గురువు, సంగ్రహించిన భగవద్గీత శ్లోకములు చదవడం చూస్తాము. అట్టి మృత్యుద్వారములో ఉన్నవాని శిరస్సు యొద్ద వైష్ణవ గురువు పద్మాసనములో కూర్చుండి భగవద్గీత యొక్క పదునెనిమిది అధ్యాయముల నుండి ఒక్కో శ్లోకము లేదా రెండు శ్లోకములు చదువుతారు. ఒక్కో అధ్యాయములో రెండు పంక్తులు కల శ్లోకమును చదవగానే, జీవుని ఆత్మ, ఒక స్థితి నుండి వేరొక స్థితికి, దశల వారి నిష్క్రమించే రీతి క్రింద వివరింపబడినది.
1) ప్రధమ అధ్యాయము (శ్లోకములు 21-22)
శ్లోకములు " హ్రిషికేశం తథా వాక్యం" తో ఆరంభమై " రణసముద్యమే" తో ముగియును

om

యుద్ధ భూమిలో రధముపై ఉన్న అర్జునుడు శ్రీ కృష్ణునితో “కృష్ణా ! రధమును ఒక ప్రక్కకు తీసుకొనివెళ్ళు, నేను మొత్తము శత్రుసైన్యాన్ని చూడాలి. అంతేకాక దుర్యోధనుని పక్షాన నిలబడి యుధ్ధానికి సిద్ధంగా ఉన్నవారందరని చూడాలి.
శరీర పరిస్థితి:
మృత్యు వశుడై పడియున్న శరీరానికి చూపు మసకబారడం మొదలవుతుంది. మూసివున్న కనురెప్పలలో వెలుగుకోసం కన్నులు వేగంగా తిరగడం మొదలుపెడతాయి.
2) ద్వితీయ అధ్యాయం ( శ్లోకము 7)
శ్లోకము " కార్పణ్యదోషో పహత" తో ఆరంభమయి "ప్రపన్నం" తో ముగియును

om

om

అర్జునుడు పరమవిధేయుడై శ్రీకృష్ణునితో “అర్జునడైన నేను కరుణ కలిగియుండడం వలన తెలివి కోల్పోయి కర్తవ్యమును, సహజసిద్దమైన లక్షణములను విడిచి ఉన్నాను. నీ శిష్యుడనైన నాకు ఏది హితకరమో ఉపదేశించమని నిన్ను కోరుతున్నాను. నిన్ను శరణుకోరుతున్నాను, కావున, నేను చేయవలసినది దయతో ఆజ్ఞాపించవలసినది ”.
శరీర పరిస్థితి:
కళ్ళకు సన్నని వెలుగు రేఖ కనబడడం జరుగుతుంది. ఈ వెలుగు రేఖను చూసిన తరువాత కనుఱెప్పలు మరింత వేగంగా కొట్టుకోవడం ఆరంభిస్తాయి.
3) తృతీయ అధ్యాయం ( శ్లోకము 40)
శ్లోకము ఇలా ఆరంభమయి " ఇంద్రియాణి మనో బుద్ధిహి " ఇలా ముగియును "దేహినం"

om
పంచేంద్రియములు, మనసు, బుద్ధి, కోరికలకు పీఠము వేస్తాయి. అవి ఎప్పుడు మానవుని తెలివిని ఆటంకపరుస్తూ, ఆత్మను భౌతిక శరీరమందే నివసించేవిధంగా, మనిషిని వశపరుచుకుంటాయి.
శరీర స్థితి:
కళ్ళ కదలిక పూర్తిగా నిలిచిపోతుంది. దృష్టి లోనికి మరలుతుంది. కంఠము క్రింది భాగములో ఎత్తుగా పొడుచుకు వచ్ఛే కంఠమణి పైకి క్రిందకి కదులుతుంది. వెక్కిళ్లు మొదలవుతాయి.
4) నాలుగవ అధ్యాయము (శ్లోకము 21)
శ్లోకము “నిరాశీర్ యధాసీదాత్మ” మొదలుకొని “కర్మ కుర్వాణోప్తి కుల్ఫీశం” వరకు.

om
మనసును పూర్తిగా నిగ్రహించగలిగి, కోరికలు లేనివాడై, శరీరమును జయించినివాడై, ప్రాపంచిక విషయములందు సంపూర్ణముగా విరాగియై, కేవలము శరీర ఉనికి నిలుపుకోవడానికి అవసరమైనంత మేరకే చర్యలు సలుపుతున్న వానికి ఎట్టి హాని కలుగదు.
శరీరస్థితి:
శరీరము నెమ్మదిగా ఉష్ణోగ్రతను కోల్పోవడము మొదలవుతుంది. చేతి వ్రేళ్ళ కొసలు మొదలుకొని భుజము వరకు చల్లబడుతుంది. ఈ దశలో శరీరముయొక్క చల్లదనము ఆత్మకు తోచగానే, చల్లబడిన శరీరము నుండి వేరుపడడానికి ప్రయత్నిస్తుంది. రెండు చేతులూ చల్లబడగానే, ఆత్మ నాభీద్వారము నుండి నిష్క్రమించడానికి యత్నిస్తుంది. ఇప్పుడు, గురువు నాభి ద్వారమును మూసి ఆత్మనిష్క్రమణను నిలిపి వేస్తారు.
5) పంచమ అధ్యాయం ( శ్లోకములు 8, 9)
శ్లోకములు ఇలా ఆరంభమయి " నైవ కించిత్కరోమీతి " ఇలా ముగియును "ఇతి ధారయన్ "


ఆత్మజ్ఞానము కలిగిన యోగి తాను చేసే కర్మలు తనవి కావని ఎరిగివుంటాడు. చూడడము, స్పృశించడము, శ్రవణము, వాసన చూడడం, భుజించడము, కదలడము, నిద్రించడము, ఊపిరి తీసుకోవడం, అన్నీ ఆతనికి చెందవు అని పూర్తిగా తెలిసికొని ఉంటాడు. బుద్ధిపూర్వకంగానైనా, అప్రయత్నముగానైనా, పంచేంద్రియములు ఎప్పుడూ, వాని వాని ఆకర్షణలకు లోనవడం జరుగుతుంది. అట్టి జ్ఞానమును కలిగిఉండి, దానికి తోడుగా, తన కర్మల నుండి తన్ను తాను వేరుపరచుకోగలిగితే, ఆతడు ఆత్మసాక్షాత్కారానుభవము పొందడానికి దారి తీస్తుంది.
శరీర పరిస్థితి:
నాభినిష్క్రమణను మూసినందువలన, ఆత్మ క్రిందికి జరిగి, బాహ్య జననేంద్రియముల ద్వారా బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఈ అవస్థలో, కడుపు ఉబ్బి, మూత్ర విసర్జనము అప్రయత్నపూర్వకంగా జరుగుతుంది. జననేంద్రియముల నిష్క్రమణను కూడా గురువు ఆటంకపరుస్తారు.
6) షష్టమ అధ్యాయం (శ్లోకము 25)
శ్లోకము ఇలా ఆరంభమయి " శనై రుపపరమేత్ " ఇలా ముగియును "చిన్తయేత్ "

om
మనోధైర్యమును కలిగి, తర్కముతో జత కలిపి, మనిషి స్థిరచిత్తుడై, నిశ్చలత్వము, శాంతి పొందడానికి కృషి (ప్రయత్నము) చేయాలి. ఒక్కసారి ఆత్మస్వరూపమునందు మనస్సు నిష్ఠ కలిగియుంటే, ఇక ఆ మనసు ఎక్కడికి పరిభ్రమించదు.
శరీర పరిస్థితి:
ఆత్మ మరింత క్రిందికి జరిగి పాయువు ద్వారా నిష్క్రమించడానికి ప్రయత్నిస్తుంది. ఈ దశలో మూత్రవిసర్జనం హఠాత్తుగా ఆగిపోతుంది. ఉదరము మరింత ఉబ్బి, శ్వాస క్రియ ఆయాసముతో, శబ్దముతో కూడుకొని, ప్రేగులు మెలిబడతాయి. శరీరము యొక్క క్రింది భాగము పొర్లడము ప్రారంభిస్తుంది. సద్గురువు ఈ నిష్క్రమణను (పాయువును) అడ్డగించడం జరుగుతుంది.
7) సప్తమ అధ్యాయం ( శ్లోకము 30)
శ్లోకము ఇలా ఆరంభమయి " సాధిభూతాధిదైవం " ఇలా ముగియును "విధుర్యుక్తచేతసః "

om
'ఆదిభూతం, అదిదైవం మరియు ఆదియజ్ఞం ' అనే మూడు రూపాల ద్వారా ఎవరైతే నన్ను గ్రహిస్తారో, వారు మరణశయ్య మీద కూడా స్థిరమైన మనస్సుతో నాపైనే దృష్టి పెడతారు.
శరీర పరిస్థితి:
పాయువు యొక్క నిష్క్రమణను కూడా నిరోధించిన తరువాత, చేతులు మరియు కాళ్ళు హింసాత్మకంగా కుదుపుతాయి. శరీరం చల్లబడడం ప్రారంభమవుతుంది, పాదాల కాలి కొన నుండి బాహ్య లైంగిక అవయవాల వరకు.
8)అష్టమ అధ్యాయం ( శ్లోకములు 12, 13)
శ్లోకములు ఇలా ఆరంభమయి " సర్వ ద్వారాని " ఇలా ముగియును "పరమాం గతిమ్.

om
ప్రాణప్రయాణ సమయమునందు ఎవ్వరైతే నవద్వారములను బంధించి, మనస్సును హృదయమునందు కేంద్రీకరించి, యోగస్థితిలో నిమగ్నుడై ప్రాణ సూత్రము శిరస్సుఫై నుంచి, ఓంకారము జపిస్తూ, ఏకాగ్రతతో నన్ను ధ్యానించితే స్వర్గమును చేరగలడు.
శరీర పరిస్థితి:
ప్రతి నిష్క్రమణ ద్వారా బయటపడటానికి చేసిన ప్రయత్నంలో విఫలమైన ఆత్మ, ఆగ్రహించి, ఇప్పుడు అన్ని నిష్క్రమణల ద్వారా ఒకేసారి బయటపడటానికి పేలిన బాంబు లాగా వ్యాప్తి చెందడానికి ప్రయత్నిస్తుంది. ఆత్మ యొక్క ఈ ఆకస్మిక చర్య ద్వారా సమీప శీతల శరీరం ఇప్పుడు సాధారణ పరిమితులను మించిన ఉష్ణోగ్రతకు చేరుతుంది.
9) నవమ అధ్యాయము ( శ్లోకము 18)
శ్లోకములు ఇలా ఆరంభమయి " గతిర్భర్థా ప్రభుః" ఇలా ముగియును "బీజ మవ్యయం "

om
జీవమూలము, జగత్ప్రభువు, జగత్సంరక్షకుడు, సాక్షి, పుడమి, స్నేహము, జన్మస్థలము, శరణాగతి, నిధి, మరియు విశ్వమంతటికి బీజము నేనే.
శరీర పరిస్థితి:
ఈ దశలో, సద్గురువు శక్తిని వినియోగించి నవ ద్వారముల నిష్క్రమణ పూర్తిగా మూసివేయగా, శరీరము ఆకస్మికంగా చల్లబడుతుంది.
10) దశమ అధ్యాయము ( శ్లోకము 41)
శ్లోకములు ఇలా ఆరంభమయి "యద్యద్విభూతిమస్త్వత్వం" ఇలా ముగియును "తేజోమ్ శ సంభవం

om
నా యొక్క విభూతి తత్వమును తెలిపే ఎటువంటి వస్తువైనా, లక్ష్మి అంశను పొంది, అత్యంత శక్తిని కలిగి ఉంటుంది. అట్టి వస్తువు నా శక్తి తత్వమునుండి పుట్టినదే అని పరిగణించాలి.
శరీర స్థితి
శరీరమును వీడిన ఆత్మ, ఇప్పటి జీవితయాత్రలో కొన్నైనా మంచి పనులను చేసి ఉంటే, దివ్యదృష్టితో ఇప్పటి వరకు అన్ని జన్మలను పరిణామక్రమములో ఒక చలనచిత్రములాగా వీక్షించే అవకాశము లభిస్తుంది. ఈ భూలోకంలో మునుపటి జన్మల ఉనికినంతటిని ఆత్మ చక్కటి స్పష్టతతో, నిష్పక్షపాత దృష్టితో చూడగలదు. ఈ ప్రక్రియ మొత్తము కొన్ని సెకనులలో జరిగిపోతుంది.
11 ఏకాదశ అధ్యాయం ( శ్లోకములు 55, 8)
శ్లోకము ఇలా ఆరంభమయి "మత్ -కర్మ -క్రున్ మత్-పరమో " ఇలా ముగియును "మామేతి పాండవ "
శ్లోకము ఇలా ఆరంభమయి " న తు మాం శo క్యాసే " ఇలా ముగియును "యోగ మైశ్వరం"

om
ఏ పురుషుడైనా, నా పని తనదిగా స్వీకరించి, నన్ను విశ్వమంతటిలోనూ మహోన్నతముగా భావించి, మోహరహితుడై, సృష్టిలో ఏ ఒక్క ప్రాణిని శత్రువుగా పరిగణింపక, జీవితపర్యంతము నా యందు భక్తి కలిగిఉంటే, నాలో ఐక్యత చెందును. అర్జునా, నీ భౌతిక నేత్రములనుపయోగించి దివ్యదర్శనం పొందడానికి అశక్తుడవు. నా యొక్క దైవీకతను సందర్శించడానికి నీకు దివ్యదృష్టిని ప్రసాదిస్తాను. తద్వారా నీకు యోగము చేకూరి నా దివ్యత్వమును గ్రహించగలుగుతావు.
శరీర పరిస్థితి:
ఈ స్థితి యందు ఆత్మకు తన తరువాతి గమ్యము, తదుపరి కర్తవ్యము తెలిసి వస్తాయి. జీవుని స్వాగతించడానికి ఆతనికి సంబంధించిన పరివారము, స్నేహితులు, శ్రేయోభిలాషులు, తక్కిన వారు ఒక స్వాగత సమారోహముగా ఏర్పడుతారు. పక్షపాతరహితదృష్టితో, ఆత్మ ఇప్పుడే ముగిసిన జన్మలో తాను చేసిన పనులను బట్టి ఏర్పడిన పాపపుణ్యములను పరిశీలించుకోగలదు. ఇప్పుడు, ఆ ఆత్మ యొక్క పరిణతిని బట్టి ఎంచుకున్న గురువు, లేక పూజించిన ఆకృతిలో మార్గనిర్దేశకుడు, ఎదురుగా దివ్యమైన కాంతులు వెదజల్లుతూ ప్రత్యక్షమౌతారు. ఆత్మ కూడబెట్టుకున్న పుణ్యమును పరిగణించి, గురువు కోరితే ఆత్మకు ఉపదేశము దక్కవచ్చు. ఈ దశ ముగిసే వరకు ఆత్మకు విముక్తి సాధ్యపడదు.
12) పన్నెండవ అధ్యాయము (శ్లోకము 12)
శ్లోకము ఇలా ఆరంభమయి " తేషామహం " ఇలా ముగియును "మయ్య అవేశిత చేతసామ్ "

om
ఎవ్వరైతే దృఢమైన సంకల్పంతో నన్ను పట్టుకుంటారో, వారిని సంసార సాగరమునుండి నేను తొందరగా రక్షిస్తాను. వారిని మరణము నుండి శాశ్వతత్వము చేరునట్లు నడిపించగలను.
శరీరస్థితి:
ఈ దశలో ఆత్మ శాశ్వతముగా భౌతిక శరీరమునుండి వేరుపడడానికి సిద్దమవుతుంది. ఇప్పుడు ఆత్మకు చూపవలసినవి చూపి, భిన్నత్వములో కల ఏకత్వమును గ్రహింపచేసి, అదే దైవమని తెలిసేట్లు చేసి సద్గురు దైవీక బాధ్యత పూర్తి గావిస్తారు. అటు పిమ్మట, గురువు ఆత్మను భౌతిక శరీరమును వీడిపోవుటకు అనుమతిస్తారు.
13) పదమూడవ అధ్యాయము (శ్లోకము 9)
శ్లోకము ఇలా ఆరంభమయి "ఆసక్తి రన భిష్వంగః" ఇలా ముగియును " సమచిత్తత్వమిష్టానిష్టో పపత్తిషూ "

om
మనిషిజీవితంలో ఇష్టమైన, అఇష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, వానిని తటస్థుడై (స్థిరమైన మనసుతో) ఎదుర్కొని సంసారజీవనమందు పూర్తిగా మోహరహితుడై, మరియు అదే సమయంలో ప్రశాంత జీవితమును గడపాలి.
శరీరపరిస్థితి:
శరీరము నుండి వేరుపడిన ఆత్మ, ఈ భూమి మీదే ఉండి, విడిచిన శరీరము యొద్ద, చుట్టూ గాలిలో తిరుగుతూ, తాను వీడిన భౌతిక కాయము వద్ద జరిగే సంఘటనలను, సన్నివేశములను జాగ్రత్తగా, ఏకాగ్రతనుంచి పరిశీలించుతుంది. ఈ స్థితిలో తన బంధువర్గము, రక్తసంబంధీకుల యొక్క ఆలోచనలు, సంభాషణలు, సమస్తము దూరసంవాదశక్తి ద్వారా విని, గ్రహించి సత్యమేదో, కృత్రిమమైనదేదో, గుర్తించి తెలిసికొంటుంది.
14) పదునాల్గవ అధ్యాయము (శ్లోకము 20)
శ్లోకము ఇలా ఆరంభమయి "గుణానేతానతీత్య" ఇలా ముగియును "మృతమశ్నుతే"

om
భౌతిక కాయము ఆకృతి దాల్చడానికి మూల కారణము సత్వము, రజస్సు, తమస్సుఅను మూడుగుణములు. ఈ గుణత్రయమును అధిగమించిన వాడు మాత్రమే పుట్టుక, చావు, వృద్ధాప్యము, ఆవేదన, యాతన మొదలగు వాటినుండి విముక్తి పొంది శాశ్వత పదవిని చేరగలడు.
శరీర పరిస్థితి:
ఆత్మ ఇప్పుడు తాను విడిచిన శరీరానికి జరుపుతున్న క్రతువులను తటస్థయై, ఉదాసీనతతో వీక్షించుతుంది. కొన్ని సారులు మృతదేహము వెంటే ఉంటూ, శరీరానికి జరిపే త్యక్రియలు (దహనకాండ, లేక ఖననము) ముగిసే వరకు కూడా ఉంటుంది.
15) పదిహేనవ అధ్యాయము ( శ్లోకము 4)
శ్లోకము ఇలా ఆరంభమయి "తతః పదం " ఇలా ముగియును " ప్రసృతా పురాణీ "

om
ఏ విశ్వజగత్తు నుండి జీవులందరూ పుట్టినారో, అట్టి విశ్వము నెఱిఁగి, జీవన్ముక్తులై ఉన్నత స్థితి చేరిన మహాత్ముల అడుగుజాడలలో నడచి, ఇహలోక జీవితానికి మరలి రాకుండగ ఎంచుకునే మార్గము అనుసరించుటే అత్యుత్తమమైనది.
శరీర పరిస్థితి
అంత్యక్రియలు (పూడ్చడము లేక దహనక్రియ) పూర్తియైన పిదప, ఆత్మ తన యొక్క పాశములు, అనుబంధాలను బట్టి భూమి పైనే సంచరించే కాలము నిర్ణీతమవుతుంది. రోజులు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు, ఒక్కోసారి శతాబ్దాలు ఇక్కడే గడచిన మీదట, ఐహిక విషయములపై పట్టు విడువక ఉండడము ఎంతటి వ్యర్ధప్రయాసో తెలిసికొన్న అనంతరం మాత్రమే, ఆత్మ యొక్క గమనము పితృ, భువర్లోకముల దిక్కుగా మరలగలదు. ఇక్కడ, ఆత్మ తాను మనిషి జన్మనెత్తినది మొదలుకొని ఇప్పటి వరకు జరిగిన క్రమవికాసములో, జీవించిన కాలమంతటిలో, ఏర్పడిన బంధువులనందరినీ తెలిసికోగలదు. అంతే కాక, ఇప్పుడు ఆ బంధువర్గము లోని వారందరిని, వారి స్థితిని బట్టి ఎవరు ఏయే నక్షత్రలోకాలలో ఉన్నారో కూడా గ్రహించకలదు.
16) పదహారవ అధ్యాయము ( శ్లోకము 5)
శ్లోకము ఇలా ఆరంభమయి "దైవీ పద్విమోక్షాయ " ఇలా ముగియును " పాండవ "

om
దైవ కృప మోక్షమునకు దారి ఏర్పరుస్తుంది. అసుర వరము మోహము నింపి పాశములో ఇరికిస్తుంది. ఓ పాండవా! నీవు చింతించకు. నీ పుట్టుక దైవీక వరముతో కూడుకొని ఉన్నది.
శరీర పరిస్థితి:
ఈ దశలో, ఆత్మ పసిపిల్లవాని పుట్టుక వెనుక దాగి ఉన్న క్లిష్టమైన ప్రక్రియను యథాదర్శనము ద్వారా తెలుసుకోగలదు. మనిషి పుట్టుకలో దాగి ఉన్న మూల రహస్యములన్ని తెరుచుకుంటాయి. వీర్యము యొక్క పరిజ్ఞానము నర్థము చేసుకుంటుంది. ఆత్మ తన యొక్క భావి పరిణామక్రమమునకు వలసిన మార్గదర్శకాలను తెలుసుకుంటుంది.
17) పదిహేడవ అధ్యాయము ( శ్లోకము 3)
శ్లోకము ఇలా ఆరంభమయి "సత్వానురూపా సర్వస్య " ఇలా ముగియును " పురుషో యో యచ్చ్రద్దధః స ఏవ సః "

om
అర్జునా ! ప్రతి ఒక్కరి ప్రయత్నములు వారి మానసిక పరిపక్వతను అనుసరించి నడుస్తాయి. చివరకు మనిషి ఆతని ప్రయత్నముతో ఒకటి కాగలడు.
శరీర స్థితి:
దైవ ప్రేరణ తోడై ఆత్మ సద్గురుని మరియు భగవంతుని ప్రార్థన చేస్తుంది. ఏమనగా, తన కుటుంబీకులు, స్నేహితులు, ఇతర బంధువులు, అందరూ తన వలెనే, ఈ లోకమును దాటి వెళ్లే బంగారు అవకాశమును వరముగా పొందగలగాలి.
18) అష్టాదశోధ్యాయము ( శ్లోకములు 62, 66)
శ్లోకము ఇలా ఆరంభమయి "తమేవ శరణం గచ్ఛ " ఇలా ముగియును "శాశ్వతం"
శ్లోకము ఇలా ఆరంభమయి "సర్వధర్మాన్ పరిత్యజ్య" ఇలా ముగియును "మోక్షయిష్యామి మ శుచః"

om

పార్థా! నీవు సర్వేశ్వరుని శరణాగతి నొందిన, ఆతడి అనుగ్రహానికి పాత్రుడవై, అత్యున్నతమైన, శాశ్వతమైన స్థానము నంద గలవు. నిన్ను నీవు సంపూర్ణంగా నాకు మాత్రమే సమర్పించుకొంటే, అన్ని రకాల మంచి చెడులనుండి విముక్తుని గావించి, రక్షిస్తాను.
శరీర స్థితి:
ఆత్మ యొక్క మమకారాలు, అనుబంధాలు, సంబంధములు, మరియు సకల బంధనము నుండి వేరుపరచుకొని, ఈ లౌకిక ప్రపంచంలో తన పనులన్నీ పూర్తి చేసానన్న అత్యంత సంతృప్తితో క్షణిక కాలంలో ఇతర లోకాలను చేరగలదు. ఆత్మ యొక్క పాపపుణ్యముల సంక్రమణను అనుసరించి, ఇతర లోకాల ప్రయాణము నిర్ణయింపబడగా, ఆధ్యాత్మిక పరిణామక్రమము నొందే దిశగా సాగిపోతుంది.
గమనిక:
కొన ఊపిరితో ఉన్న జీవాత్మను పైన చెప్పిన విధంగా మార్గనిర్దేశము చేయ తలచిన వారు, శ్లోకములను పైకి, బిగ్గరగా చదవాలి. అత్యంత ఏకాగ్రత, భక్తి నిండిన మనస్సును కలిగి, సంస్కృతములో కాని, మాతృభాషలో కాని శ్లోకములను చదవాలి.
ఆత్మ యొక్క నిష్క్రమణ దశ, ఓక్కో శ్లోకమునకు చెప్పబడిన స్థితితో, అచ్ఛంగా ఏకీభవించక పోయినా, భగవద్గీత శ్లోకము యొక్క శక్తి, ఆత్మను తగిన విధంగా ప్రతి నిష్క్రమణ దశలో నడిపించగలదు. ఇది ధృవీకరింపబడిన యదార్ధము.
పద్దెనిమిది శ్లోకాలు ఆత్మ శరీరములో ఉన్నపుడే చదవడం పూర్తయితే కూడా (శరీరమునుండి ఆత్మ పూర్తిగా వేరుపడకుండానే), శ్లోకముల నుండి వెలువడిన ప్రకంపన ఆత్మ మీద పని చేసి, ప్రతి దశ లోనూ ఆత్మకు దారిచూపి, ఇతర లోకములు చేరేవరకు, ఆత్మ (జీవుని) యొక్క ప్రయాణములో తోడ్పడుతుంది. పైన చెప్పిన పద్ధతిలో ప్రాణములు విడిచిన వాని ముఖవైఖరిలో శాంతి, నవ్వు కనపడుతాయి. శరీరము ఉబ్బకుండా, చర్మము ముడుచుకోకుండా సంభవించే భౌతిక మరణము నిశ్చలమైన మరణము.
అప్పుడే శరీరము నుండి వేరుపడిన ఆత్మముందు మూడు నిర్ణయింపబడిన లోకాలు ఉన్నవి. ఇవి (i) చీకటి పాతాళ లోకము (ii) మధ్యస్థ లోకము (iii) ఊర్ధ్వలోకాలు . ఇక్కడ మళ్ళీ ఒక్కో ఆత్మ యొక్క ఖాతాలో వారి పాపపుణ్యముల లెక్కను బట్టి ప్రయాణపు దిశ నిర్ణయింపబడుతుంది.
చీకటి ప్రపంచములోని ఆత్మతో సంబంధము ఎట్టి వారికి సాధ్యము కాదు. మధ్యస్థ ప్రపంచములో నివసించే ఆత్మలతో సంబంధము ఏర్పరచుకోవడానికి శక్తివంతమైన మాధ్యమము అవసరము. మాధ్యమముగా వ్యవహరించ నున్న అంతటి శక్తీ కూడా, ఈ ఆత్మలతో సంబంధము ఏర్పరచుకొనే ప్రక్రియలో తట్టుకోలేక హరించుకుపోతుంది. ఊర్ధ్వలోకాలలోని వాస్తవ్యులు భూమి మీద ఉన్న మనుష్యులతో, సద్గురువులు, జ్ఞానులు ఐన సత్పురుషులు వంటి దైవీక మధ్యవర్తుల ద్వారా సంబంధం సునాయాసముగా ఏర్పరచుకోగలరు. పైన చెప్పిన మూడు లోకాలు కాక అపరిమితమైన సంఖ్యలో లోకాలు ఉన్నాయి. ఈ లోక వాస్తవ్యులు అన్ని విధాలుగా శక్తిమంతులు. ఏ ప్రపంచములోనైనా, దేశ, కాల పరిమితులకు అతీతమై ఎటువంటి అద్భుతమునైనా ఒనర్చె శక్తిని కలిగివున్నారు. ఇలా శక్తివంతమైన, పరలోక వాస్తవ్యులైన ఆత్మలు కూడా వారి పుణ్యములు తరిగినంతనే, మానవ జన్మలో ఈ భూలోకంలో పుట్టవలసిందే. ఎవరికిన్నీ, ఏ ఒక్క లోకములో, లేక ప్రపంచములో శాశ్వతముగా నివసించడానికి అనుమతి లేదు.
సర్వేశ్వరుడైన భగవంతునితో పూర్తిగా ఐక్యమై, అత్యంత దివ్యత్వము నొంది, పరమార్ధ తత్వమును ఇముడ్చుకొని పరిణతి చెందిన ఆత్మలు మాత్రమే, జననమరణ చక్రము నుండి రక్షింపబడతారు. దీనిని బట్టి, ఒక్క భగవంతుడు మాత్రమే జన్మమృత్యు ఘోర సంసార చక్రము నుండి మానవుని విడగొట్టగలిగే శక్తి. కావున, జీవాత్మ ఈశ్వరుని చేతిలో ఒక ఉపకరణము మాత్రమే - ఈ సిద్ధాంతము ‘అభేద వాదము’ గా చెప్పబడినది. ‘నేను సర్వశక్తుడను, నేను ఏమైనా చేయగలను’ అన్న తలంపు మాయ వలన పుట్టే ఆలోచన.
అందరూ ఒక్కరు, మరియు ఒక్కరే అందరు - ఇది భేదము.
వివేకమును కోల్పోయి సమస్త విషయముల మీద మమకారము పెంచుకునే మానవాళి గురించి భోగరు ఋషి, సద్గురువైన అగస్త్య మహర్షులను ఈ విధముగా ప్రశ్నించారు. “ఏది ఒక వ్యక్తిని, ఆతనిని ఈ భౌతిక ప్రపంచానికి కట్టివేస్తుంది?” అగస్త్య మహర్షి సమాధానం ఇచ్చారు, ‘నా ప్రియమైన శిష్యుడవైన భోగా! భయము, అజ్ఞానము, ప్రతికూలభావము అనే ముగ్గురు దుష్ట శత్రువులు జీవాత్మలను వారి ప్రపంచముతో కట్టివేస్తాయి.’
ఒక వ్యక్తి తన విద్యాప్రావీణ్యత, శక్తిసామర్ధ్యములు, సంపద, సాఫల్యత, కార్యసిద్ధి, అధికారము వంటివి ఇతరుల కున్నవానితో పోల్చుకోవడం, మరియు ఇవి మాత్రమే ఆతని జీవితంలో ప్రధాన అంశాలు అన్న నిశ్చయాభిప్రాయము కలిగి ఉండడము అవివేకము. ఇట్టి ఆలోచన వేరేదీ కాదు, కేవలము భ్రమలే (మాయ).

om

స్వామి జ్ఞానానంద గిరి

విశ్వమంతటిని ఒక ఉన్నతమైన శక్తి అధిపతియై పాలించి ఉన్నాడని మనిషి తనంత తాను గ్రహించడం లేదు. ఇదివరకే చెప్పబడినట్లు, విద్య, శక్తి, సంపద మొదలగు విషయభోగాలు, ఇహలోక సాఫల్యతలు, వీనియందు, ఎదో ఒక దానిలో, లేక కొన్నింటిలో మార్పు రావడమో, లేక కొల్పోవడమో జరిగినప్పుడే మనిషి విశ్వానికి అధిపతియై ఉన్న ఈశ్వరుని అర్ధం చేసుకునే దిశగా ఆలోచనాశైలిని మార్చుకుంటాడు.
మాయ యొక్క సంకెళ్ళ నుండి తప్పించుకోవాలంటే, మనిషి ఆతని దినచర్యలనుండి తనను తాను వేరుపరచుకోవాలి. వినమ్రతతో తనను తాను భగవంతునికి అర్పించుకోవడమేగాక, చర్యలన్నింటినీ కూడా దైవానికి సమర్పణ చేసుకోవాలి. ఇటువంటి విధేయతను అలవరచుకోడానికి, వ్యక్తి క్రమము తప్పకుండా నియమిత దినాలలో గుడికో, మసీదుకో, చర్చికో, గురుద్వారకో, మరే మందిరానికైనా ఆతని మతాచారముననుసరించి వెళుతుండాలి. జీవుని మృత్యువు నుండి అమరత్వము వైపు నడిపించే అవ్యయమైన జ్యోతిని పూజించాలి.
చివరగా, మాయను నశింపజేసే ఆయుధాలలో ధ్యానము ఒక శక్తివంతమైన ఆయుధము. కానీ, ధ్యానపద్ధతులందు సంపూర్ణప్రావీణ్యత పొందడము మానవులందరికీ సాధ్యము కాదు. వామ శాస్త్రములందు, ధ్యానము చేసే సరైన పద్దతులను విస్తృతంగా వివరించారు. కేవలము రెండు కళ్ళు మూసి ఉంచి, మరియు అస్పష్టంగా వివిధ విషయాలమీదికి ఆలోచనలను పోనిస్తూ ధ్యానమనుకుంటే, అది ధ్యానమే కాదు.
మొట్టమొదట, వ్యక్తి ఆతని శరీరమును నశింపచేసే, లేక హాని పరచే ఎటువంటి దురలవాట్లనుండి పూర్తిగా స్వతంత్రుడై ఉండాలి. ఆ తరువాత అత్యంతమైన ఓర్పు కలిగి, నిరంతర శ్రమకోర్చి, స్థిరమైన, క్రమబద్ధమైన రీతిలో మనసును స్వాధీన పరచుకోవాలి. ఆలోచనలను పూర్తిగా తిరస్కరించితే, బ్రహ్మము నందు ఏకాగ్రత పెంపొంది, ఫలితముగా ఆతడి మనస్సు అంతర్లీనమై, శాశ్వతముగా ధ్యానములో నిమగ్నమౌ స్థితిని చేరగలడు. ప్రాచీన ఋషులు, మరియు ఆధునిక కాలంలోని మహాత్ములు ఆచరించిన యదార్ధ ధ్యానపధ్ధతి ఇదే.
ఒక మనిషి, తనమీద తనకు చెక్కుచెదరని నమ్మిక వుంటేనే, ఎట్టి ప్రయత్నములోనైనా, సాఫల్యత పొందగలడు, అందునా, ధ్యానము నవలంబించుకోవడంలో, మరింత దృఢమైన విశ్వాసముతో సాగాలి. ప్రతి మనిషి విజయము జన్మహక్కుగా భావించి, లక్ష్యము చేరడానికి శ్రమించాలి. వ్యక్తి, తన ప్రమాణము, శక్తి సామర్ధ్యములను సందేహించడమే మాయ. సర్వేశ్వరుని తలంపులో నిమగ్నుడై, జీవితంలో ఎట్టి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కొనడమే భేదము.
ఆత్మవిశ్వాసమును సత్వరమార్గములో గడించడానికి మనిషి ప్రతిదినము తాను సాధించిన ప్రగతిని మునుపటి రోజున తాను విశ్లేషించుకొన్న పురోగమనంతో పోల్చుకోవాలి. ఈ విధంగా అభివృద్ధి చెందాలి తప్ప, వేరొకరి పురోగతితో పోలిక సరికాదు. ఇతరుల పట్ల వారి యొక్క కలిమి, బలిమి, అధికారము వంటి ఇహలోక ఘనతల వలన ఏర్పడిన వినయము నిజమైన విధేయత కాదు. మహాత్ములను వీక్షించినంతనే, సాధకుని శరీరము, మనస్సు, ఆత్మ వినమ్రతతో తగ్గి, అన్నీ చిన్నవైన భావన కలుగుతుంది. ఇది నిజమైన విధేయత.
చివరగా చెప్పినా, ఎంతో ముఖ్యమైనవి మనిషి ఆలోచనలు . శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు, ‘మనిషి నమ్మికలతో తయారుచేయబడతాడు. తాను విశ్వసించిన విధముగా, అతడు.’ మనిషిని మలచేది స్వీయ ఆలోచనాసమూహము, తుదిని తాను భావించినట్లే ఆతడు రూపొందడం జరుగుతుంది. స్వామి జ్ఞానానందగిరి గొప్ప మహాత్ములు. కేవలము ఈ లోకపు అభ్యున్నతికి ఉదయించినవారు. ఆధ్యాత్మిక మహానుభావులలో మనస్సు అనే అంశముపై సంపూర్ణస్వాధీనత కలిగిన వారిలో ఒకరు. వారు ప్రపంచానికి ఇచ్చిన సందేశము, ‘దైవము తప్ప సర్వము మాయ. పరమాత్మలో లీనమవ్వడానికి ఒనర్చే నిరంతర అభ్యాసము భేదము.’
స్వామి జ్ఞానానందగిరి లాటి మరో మహాపురుషులు స్వామి రామకృష్ణ పరమహంస. పరమాత్మ కోసం సమస్తమూ త్యాగం చేసినవారు. ఆశ్చర్యములలోకెల్లా ఆశ్చర్యకరమైన విషయము ఏమనగా సొంత భార్యను తల్లివలె ఆదరించిన ఋషి. తద్వారా హైందవ ధర్మములోనే స్త్రీ జాతికి మహోన్నత స్థాయిని, కీర్తిని కల్పించారు.
భార్య భర్త వినోదమునకు ఉపయోగపడే వస్తువు కాదు. పురుషుని జీవితంలో ప్రతి అవస్థలోనూ స్త్రీ స్నేహితురాలివలె సహాయపడి, మంత్రి వలె సలహాలనొసగి, దినచర్యలలో దాసిగా ఆచరణ సలిపి, చివరగా, వృధ్ధాప్యము నందు తల్లిగా సేవించి, రక్షిస్తుంది. కాబట్టి, భార్యను విలాసవస్తువుగా పరిగణించడము మాయ. భార్యను గౌరవించి, పూజ్యభావముతో ఆదరించుట దైవ ప్రేరణ. ప్రతి పురుషుడు భార్యను ఒక తల్లిలా ఆదరించే అలవాటును నెమ్మదిగా, చిన్నవయసు నుండే అలవరచుకోవాలి. ఈ ఒక్క విధము నవలంబిస్తేనే, ఒకరి జీవితంనుండి, లైంగిక వాంఛలను తరిమివేయడం సాధ్యము. హైందవ ధర్మము స్త్రీలందరినీ శక్తి యొక్క దైవీక అంశలుగా పరిగణించి, సంఘములో ప్రధాన పాత్రనొసగి, ఉన్నత స్థాయిని కల్పించినది.
సద్గురువు యొక్క హృదయపూర్వకమైన మరియు సంపూర్ణ ఆశీర్వాదములు ఉన్నప్పుడే మాయను పునరుద్ధరించకుండా నశింపచేయడము సాధ్యము. సర్వశక్తుడైన గురువు మాత్రమే సర్వవ్యాపకమైన మాయను జయించే విధానము తెలిసినవారు. అదే సమయంలో, శిష్యుడు దృఢమైన భక్తిని, చిత్తశుద్ధిని కలిగివుండాలి. గురువు ఎల్లవేళలా కారుణ్యమూర్తి. గురువు శిష్యుని లోపాలను సరిదిద్దుకోవడానికి అనేక అవకాశములను ఇవ్వడం సద్గురుని కరుణకు నిదర్శనం. గురువు యొక్క ఔదార్యమును, శిష్యుడు సక్రమమైన దారిలో వెళ్ళడానికి ఉపయోగించుకోలేనప్పుడు, శిష్యునితోటి సంబంధమును గురువు తెంచుకోవడానికి వెనుకాడరు. శిష్యులైనవారు గురుని యెడల అమిత విశ్వాసమునుంచుకొని, గురువు యొక్క ఉపదేశము లేక ఆజ్ఞలు అవ్యక్తముగానున్నా, సూచనప్రాయంగా ఉన్నా, అనుసరించడానికి ముందుండాలి. ఇట్టి విశ్వాసము మాత్రమే మనిషిని ఆత్మసాక్షాత్కారము గమ్యంగా ఉన్న మార్గంలో నడచుటకు ప్రేరేపించగలదు. తుదిఫలితము దైవముతో లీనమవ్వడమే. ఆత్మసాక్షాత్కారం అనుభవములోకి రాకపూర్వం సర్వము మాయగా అగుపడుతుంది. ఆత్మసాక్షాత్కార అనుభవము పొందిన తరువాత సర్వము వైవిధ్యము. జ్ఞానము పొందిన తరువాత, జ్ఞానము, జ్ఞానమును కలిగియున్న వస్తువు, అదృశ్యమౌతాయి. అప్పుడు, మిగిలి ఉండేది ఒకటి, అది కేవలము బ్రహ్మము మాత్రమే. ఎటువంటి మనిషియైనా, బ్రహ్మములో లీనమై యుంటే, చివరకు తాను ఆ బ్రహ్మమే కాగలడు. ‘బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి’ అని, జ్ఞానముతో ప్రకాశించే ఋషులు చెబుతారు.
అగస్త్య ప్రభువు పైన చెప్పిన విషయమును సరళమైన మాటలలో ఈ విధంగా వివరించారు. ఒక వ్యక్తికి ఆతని గురువు అమురినీరు అనే రహస్యములో దీక్షనీయక పొతే మాయకు మూలమైనదానిని ఆతడు ఎన్నడూ తెలిసికొనలేడు.

సంస్కృత భాషలో ప్రావీణ్యము లేనివారికోసము పైన చెప్పబడిన భగవద్గీత లోని ఇరవై మూడు శ్లోకములు క్రింద పఠింపబడినవి.



శివార్పణమస్తు
ఓం సద్గురు శరణమ్

 
om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya
om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi
om sri guruve saranam om sri guruve saranam om sri guruve saranam